Mahabubnagar localbody mlc bypoll: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 108 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మార్చి 28న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ఉప ఎన్నిక కౌంటింగ్ను పెండింగులో ఉంచారు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా, ఇద్దరు తప్పితే అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. రెండున్నర గంటల్లోనే ఫలితం వెలవడింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు.
గతంలో ఈ స్థానం బీఆర్ఎస్ పార్టీదే. బీఆర్ఎస్ తరపున కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ గూటికి వచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కసిరెడ్డి గెలుపొందారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ALSO READ: తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్దం గడిచిందంటూ కేటీఆర్ ట్వీట్
బీఆర్ఎస్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ కారు పార్టీలో కొనసాగుతారా? లేక మరో పార్టీకి జంప్ అవుతారా అనేది చూడాలి.