Telangana Liberation Day Celebrations: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సికింద్రబాద్ పరేడ్ మైదానంలో కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.
నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి అన్నారు.
అంతకుముందు, అమర జవాన్ల స్తూపానికి, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద స్పీకర్ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. కొంతమంది విలీన దినోత్సవం, ఇంకొందరు విమోచన దినోత్సవం అని సంభోదిస్తున్నారన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరపడం సముచితమని భావించామన్నారు.
1948లో తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాపాలనకు నాంది పలికారన్నారు. అందుకే ప్రజా కోణాన్ని జోడిస్తూ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం పేరును పెట్టామన్నారు.