రాష్ట్రంలో మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు క్రమేపీ పెరుగుతుండటం ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే, రిమాండ్ ఖైదీలను తరలించే జైళ్ల పరిధిని మార్చడం కూడా ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖైదీల్లో మానసిక సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక డ్రగ్స్ వినియోగం కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్లలో పట్టుబడుతున్న నిందితులను దాదాపుగా చంచల్గూడకే తరలిస్తున్నారని సమాచారం. దీంతో జైల్ లోని బ్యారక్లు నిండిపోతున్నాయి. అయితే గతంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. LB నగర్, రాజేంద్రనగర్, షాద్నగర్ కోర్టుల్లో రిమాండ్ ఖైదీలను చర్లపల్లి జైలుకు తరలించేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. చర్లపల్లికి తరలించేందుకు రవాణా వ్యయం ఎక్కువ అవుతుండటంతో పాటు ఎస్కార్ట్ కల్పించడానికి ఇబ్బందులు కలుగుతుండటంో న్యాయస్థానాల అనుమతి తీసుకుని చంచల్గూడ జైలుకే ఖైదీలను తరలిస్తున్నారు.
చంచల్గూడ జైలులో 1250 మంది ఖైదీల సామర్థ్యం కలిగి ఉంది. కాగా, ప్రస్తుతం 2103 మంది ఖైదీలు ఈ జైలులో ఉన్నారు. జైలుకు ఖైదీలు పోటెత్తుతుండటంతో గతంలో క్లోజ్ చేసిన VIP బ్యారక్నూ తెరిచి సర్దుబాటు చేస్తున్నారు. ఈ జైలులో ప్రతి రోజు సగటున 500 వరకు ములాఖత్లు ఉంటాయి. ఖైదీలు అధికమయి కారణంతో వారి కుటుంబ సభ్యులందరికీ ములాఖత్ కల్పించడం కష్టమవుతోంది. దీంతో రోజూ 2 గంటలపాటు అదనంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. అప్పటివరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఖైదీల కుటుంబసభ్యులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇక జైలులో డ్రగ్స్ కేసుల నిందితుల చేష్టలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడలేక వ్యసనానికి బానిసలైనవారు అధికారులకు తలకు మించిన భారంగా మారుతున్నారు.
Also Read: సిద్ధిపేటలో టెన్షన్ వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల పరిస్థితి పరిశీలిస్తే.. ప్రస్తుతం 4 కేంద్ర కారాగారాలున్నాయి. 7 జిల్లా జైళ్లు, 29 సబ్ జైళ్లు, 2 మహిళా జైళ్లు, 3 ఇతర జైళ్లు ఉన్నాయి. అయితే ఈ మొత్తం జైళ్ల సామర్థ్యం 7 వేల 392 ఉండగా.. ప్రస్తుతం 7 వేల 667 మంది ఖైదీలున్నారు. వీరిలో అత్యధికంగా విచారణ ఖైదీలు 4 వేల 791 మంది ఉన్నారు. ఇందులో శిక్ష ఖరారైన ఖైదీలు 2023 మంది ఉన్నారు. రిమాండ్ ఖైదీలు 838, ఇతర బందీలు 15 మంది ఉన్నారు.
ఇక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కారాగారాన్ని ఖాళీ చేయించింది గత ప్రభుత్వం. దీంతో వరంగల్ కారాగారానికి చెందిన వెయ్యి మంది ఖైదీలను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జైళ్లలో సర్దుబాటు చేశారు. మరోవైపు 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సిద్దిపేట జిల్లా జైలు అందుబాటులోకి వస్తే.. కొంత ఉపశమనం కలుగుతుందని జైళ్లశాఖ అధికారులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం సిద్దిపేట జైలు నూతన భవనం అందుబాటులోకి వస్తే 500 మంది ఖైదీలను అందులో ఉంచే అవకాశముంది.