Rain Alert In Telangana(TS today news): ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఆవర్తనం ఒడిస్సా వద్ద సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే మరో వైపు ఉత్తర – దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్ , సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతే కాకుండా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని తెలిపింది.
ఎల్లో అలర్ట్:
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్లు చెరువులు నిండి ప్రవహిస్తున్నాయి. బయ్యారం పెద్ద చెరువు కూడా అలుగు పారుతోంది. గార్ల మండలం శివారు పాకాల వాగు పొంగి ప్రవహించడంతో గార్ల నుంచి మద్దివంచ, రాంపూరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ మండలం పెసర బండ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరుకోవడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరో వైపు ఈ వానలు పంటలకు ఎంతో దోహదం చేస్తాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.