CM Revanth Reddy New Tag Line for Telangana: తెలంగాణకు కొత్త పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి కొత్త ట్యాగ్ లైన్ ను ప్రకటించారు. తెలంగాణను ఇకపై ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దదామని పిలుపునిచ్చారాయన. రాజధాని హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులకు ఈ ట్యాగ్ లైన్ పర్యాయపదంగా ఉంటుందని తెలిపారు.
కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఏఐ బిజినెస్ రౌండ్ టేబుల్ లో టెక్ యూనికార్న్ సీఈఓలతో సీఎం రేవంత్ మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులంతా ఒకసారి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అందరి భవిష్యత్తు మారుతుందని తెలిపారు.
Also Read: పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా టూర్.. ఐటీ ప్రతినిధులకు పిలుపు
ఇప్పటివరకూ న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో పర్యటించి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్నామని తెలిపారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఉన్న ప్రతీ రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, దానికొక నినాదం ఉంటుందని, అవుట్ ఆఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ రాష్ట్ర నినాదమని చెప్పారు. అలాగే టెక్సాస్ ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారని, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉందని చెప్పారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు అటువంటి నినాదాలు, ట్యాగ్ లైన్లేవీ లేవని, అందదుకే తెలంగాణకు ఒక లక్ష్య నినాదాన్ని పెట్టుకున్నామని వివరించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రపంచంలోని టెక్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఏఐ యూనికార్న్ కంపెనీ ఫౌండర్స్ స్వయంగా హైదరాబాద్ ను సందర్శించి.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.