Raghavendra Rao : ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని ఆయన సొంత అవసరాలకు వాడుకున్నారని దాఖలైన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం.. రాఘవేంద్రరావు సహా ఆయన బంధువులకు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని షేక్పేటలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం సినీ పరిశ్రమకు కేటాయించింది. అయితే,.. ఈ భూమిని రాఘవేంద్రరావుతో సహా ఇతరులు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపిస్తూ.. మెదక్కు చెందిన బాలకిషన్ 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. దీనిపై విచారించిన కోర్టు అప్పట్లోనే రాఘవేంద్రరావు సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది. అయితే అవి ఆయనకు అందినట్టుగా రికార్డుల్లో లేకపోవడంతో.. హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 18,2024కి వాయిదా వేసింది. కాగా.. రాఘవేంద్రరావుకి హైకోర్టు నోటీసులు అందడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసింది.