దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ. బడాబాబులకు కేరాఫ్ అయిన ఈ సొసైటీలో అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. పాత కమిటీ గుడిలో లింగాన్ని మింగేస్తే, కొత్త కమిటీ ఏకంగా గుడినే మింగేసే కుట్రలు చేస్తోంది. ఆ భూ దందాలన్నింటినీ ఎప్పటికప్పుడు స్వేచ్ఛ వరస కథనాలతో జనం ముందు ఉంచుతోంది. అయితే, టీవీ ఛానల్స్ అడ్డం పెట్టుకుని చట్టం నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో కమిటీలు, ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీల దర్యాప్తులు జరిగి తప్పులు చేశారని కేసులు నమోదు అయినా ఇప్పటికీ చర్యలు శూన్యమే. అందుకే, బడాబాబుల సోసైటీల అక్రమాలు, అవినీతి, వందల కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా ఇవ్వడంపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ప్రచురిస్తోంది.
సభ్యత్వం మాటున భారీ అవినీతి.. బయటపెట్టిన స్వేచ్ఛ
30 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఓపెన్ స్పేస్గా తెగనమ్ముతున్నారు. వీటితో పాటు కొత్త మాయాలోకం చూపించి సుమారు 2 వేల మంది నాన్ అలాటీస్ని మభ్యపెడుతున్నారు. దీనిపైనే స్వేచ్ఛ గత నెల 28న ‘‘జూబ్లీ గ్యారేజ్.. ఇచట ఏదైనా సాధ్యమే – దందాకో రేటు, లాబీయిస్టులదే రైటు’’ పేరుతో రూల్సూ గీల్సూ జాన్తా నై అంటూ 800 మంది సభ్యత్వం రద్దు, కొత్త సభ్యత్వాలు, ల్యాండ్ వ్యవహారంపై క్షుణ్ణంగా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడున్న మేనేజ్మెంట్ కమిటీ, భారీగా డబ్బు కొట్టేసేందుకు కొత్తగా 800 మందికి సభ్యత్వాన్ని ఇచ్చేందుకు వేసిన ఎత్తుగడను అందరికీ వివరించింది. సొసైటీలో కట్టబోయే పెద్ద అపార్ట్మెంట్ సముదాయంలోని రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్ను ఒకటైనా కొనాలంటూ పెట్టిన కండిషన్ల గుట్టును సవివరంగా జనం ముందు పెట్టింది. కొత్తగా 800 మందిని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న కమిటీ, తమ అక్రమాలు బయటకుండా ఉండేందుకు అంతే సంఖ్యలో పాత సభ్యులను తొలగించేందుకు కుట్ర చేస్తోందని వివరించింది.
ఎక్కడా రూల్స్ పట్టించుకోని వైనం
800 మందికి మంచిరేవులలో అపార్ట్మెంట్స్ నిర్మించి ఇస్తామని డబ్బులు వసూలు చేస్తోంది జూబ్లీహిల్స్ సొసైటీ. 13.30 గుంటల భూమిలో హైరేంజ్ అపార్ట్మెంట్స్లో 1900 ఫ్లాట్స్ వచ్చేలా పక్కా ప్లాన్ గీసింది. అందమైన బ్రౌచర్ ఏర్పాటు చేసి రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ అంటూ సొసైటీ పేరు మీద వసూళ్లకు పాల్పడుతోంది. సొసైటీ యాక్ట్ ప్రకారం 10 శాతం కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లిస్ట్ ఉండరాదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. కానీ, ఈ బడాబాబుల సొసైటీ మాత్రం పట్టించుకోకుండా 40 శాతం మంది ఎక్కువ ఉన్నా కూడా, సరెండర్, రద్దు లేకుండానే కొత్త సభ్యత్వాలు ఇస్తోంది. బదులాయింపులు కూడా యథేచ్ఛగా ప్రొత్సహిస్తోంది. తెర వెనుక సభ్యత్వాలపై లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం ఉంది. ఇదే సమయంలో
టైటిల్, దారి లేని ల్యాండ్లో పెట్టుబడులు.. కోర్టు తీర్పుతో బ్రేక్
మంచిరేవులలో నాన్ అలాటీస్కి 40 అంతస్తుల భవంతులు నిర్మిస్తామని సొసైటీ చెబుతోంది. కానీ, బ్రౌచర్లో చూపించే ల్యాండ్ టింబర్ లేక్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. పక్కనే ఉండే వేణుగోపాల స్వామి ఆలయ భూముల్లో ఉండే సర్వే నెంబర్స్లో జాగా ఖాళీగా ఉంది. అసలు టైటిల్ ఉన్న భూమి అక్కడ లభించడం లేదు. ఉన్న కొద్దిపాటి భూమికి కూడా సొసైటీకి అగ్రిమెంట్ కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్లు చూపిస్తున్న 13 ఎకరాలతో పాటు చుట్టూ ఉన్న 20 ఎకరాలపై స్వేచ్ఛ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేసింది. 292, 293, 294 సర్వే నెంబర్స్లో 52 ఎకరాల వేణుగోపాల స్వామి ఎండోమెంట్ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయి. సర్వే నెంబర్ 231, 232, 234లోని 680 గుంటల ఎస్టేట్ భూమిపై కోర్టు స్టే కొనసాగుతోంది. 236, 237లో 129 గుంటల్లో ఇళ్లు ఉన్నాయి. 263 సర్వే నెంబర్లో 68 గుంటలు ఎల్బీనగర్ కోర్టు (ఓఎస్ నెంబర్ 859/2017)లో, 264లోని 104 గుంటలు హైకోర్టు(రిట్ నెంబర్ 33556/2013)లో పెండింగ్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చుట్టూ ఉన్న 265, 266, 267 సర్వే నెంబర్స్ కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి. కానీ, అదే భూమిని చూపిస్తోంది సొసైటీ. పైగా, ఈ భూమికి దారి కూడా లేదు. అందుకు 2 ఎకరాలు కావాల్సిందిగా దేవాదాయ శాఖను కోరుతోంది. ప్రభుత్వ భూమి ఇస్తే వేరే చోట 2 ఎకరాలు ఇస్తామని అంటోంది. ఆ ప్రభుత్వ భూమి విలువ అక్షరాలా 120 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇలా ఏదీ సరిగ్గా లేకుండానే జూబ్లీహిల్స్ క్లబ్లో మెంబర్ షిప్ ఇస్తామనే ఆశతో భారీగా నగదు చేతులు మారుతుండటం వెను బడా స్కెచ్ ఉంది. అందుకే కొత్త సభ్యత్వాలపై కొందరు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీ దేవి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త సభ్యత్వాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో బడాబాబుల సొసైటీకి భారీ షాక్ తగిలనట్టయింది.