రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్కు బ్రేక్ పడింది. టీడీపీ నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్లు తెలిపింది కోర్టు. సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదని రామదూత క్రియేషన్స్తో పాటు నిర్మాత దాసరి కిరణ్కుమార్కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. లోకేష్ దాఖలు చేసి పిటిషన్పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామానే ఈ వ్యూహాం సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. రంగం సినిమా ఫేం అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అసలు ఈ సినిమా ఇవాళ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో.. టీడీపీ అధినే చంద్రబాబును కించపరిచేలా చూపించారని లోకేశ్ ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమా రూపొందించారని.. టీడీపీ జెండాలు, నేతల పేర్లతో సినిమా తీశారని, తమ పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించారని.. ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని వాదించారు సినిమా నిర్మాత, దర్శకులు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నామని తెలుపుతూ తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేశారు.
వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ పై కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ . సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా వ్యూహం సినిమాలో పాత్రలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను పునర్ సమీక్షించాలని కోరారు. కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.
.
.