Big Stories

NTR Statue : ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు తొలగని అడ్డంకులు.. అనుమతులు రద్దు చేసిన హైకోర్టు..

NTR Statue : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పిటిషన్‌దారులను ఆదేశించింది. తుదిపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది.

- Advertisement -

ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో ఏర్పాటు చేయడం కోసం కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయించారు. దీనిపై యాదవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వివాదం మొదలైంది. ఈ ఇష్యూపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. గతంలోనే ఈ పిటిషన్లు విచారించిన తెలంగాణ హైకోర్టు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై స్టే విధించింది.

- Advertisement -

హైకోర్టు ఆదేశాలతో నిర్వాహకులు కాస్త వెనక్కి తగ్గి విగ్రహంలో చాలా మార్పులు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని తొలగించారు. పింఛం కూడా తీసేశారు. ఇదే విషయాన్ని కోర్టుకి కూడా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషన్ దారులు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటును ఆపాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది.

ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడానికి దాదాపుగా వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయించారు. ఎన్టీఆర్ శత జయంతి రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ‌ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం 14 పిటిషన్స్ దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ JAC, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం లాంటి సంస్థలు పిటిషన్లు వేశాయి ఎన్టీఆర్‌ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఆరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.

మరోవైపు సినీ నటి కరాటే కళ్యాణి ఎన్టీఆర్ విగ్రహంపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు హిందూ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు సమర్పించారు.. ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ కార్యక్రమానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆమె చేసిన కామెంట్స్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వివరణ కోరింది. వివరణ ఇవ్వకపోవడంతో ఆమెను సంఘం నుంచి బహిష్కరించింది. అయితే మా అసోసియేషన్ నిర్ణయాన్ని కరాటే కళ్యాణి తప్పుబట్టారు. తాను ఏం తప్పు చేశానని సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. దీనిపై కోర్టులో తేల్చకుంటానని స్పష్టం చేశారు. ఇలా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర వివాదంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News