Telangana Gurukula Teachers : తెలంగాణలో గురుకుల టీచర్లు రోడ్డెక్కారు. టీచింగ్ స్టాఫ్ ను నాన్ టీచింగ్ పనులకు వినియోగిస్తున్నారని ఆందోళనకు దిగారు. నాన్ టీచింగ్ పనులు చేయించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు విజయవంతమైన నమూనాగా ఉన్నాయి. గురుకుల ఉపాధ్యాయులు పాఠ్య బోధనతో పాటు హౌస్ మాస్టర్, డిప్యూటీ గార్డెన్స్, సూపర్వైజర్ స్టడీస్, నైట్ స్టే, ఎస్కార్ట్ తదితర ఎన్నో డ్యూటీలు చేస్తున్నారు. 24 గంటలు 7 రోజులు లెక్క చొప్పున లోకో పేరెంట్స్ గా విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని టీచర్స్ చెబుతున్నారు. అయినా ఉపాధ్యాయులకు తగిన వేతనం కానీ, కష్టానికి తగిన గుర్తింపు కానీ లభించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చిన పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని ఉపాధ్యాయులు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని అంటున్నారు. అందుకే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో అన్ని యాజమాన్యాలతో కలిపి కేవలం 298 గురుకుల విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేజీ టు పీజీ పథకంలో భాగంగా ఒకేసారి 700 లకు పైగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలతో సహా 1002 గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయి. ఒక్కో సొసైటీలో ఒక్కోరకంగా పరిపాలన అజమాయిషీ కొనసాగిస్తున్నారు. బోధన సమయంలో సైతం ఏకరూపత లేదు. ఇక కొత్త విద్యాసంస్థలు అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఇక గురుకుల పాఠశాలలో ఔట్సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే ఆరోపణ ఉంది. చాలీచాలని జీతాలు ఇస్తూ.. రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ తో సమానంగా పనిచెబుతున్నారని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు.
గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. తాజాగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాయి. ఆగస్టు 5న హైదరాబాద్ లో గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా చేయనున్నారు.