Telangana Group 1 Applications : గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం గురువారంతో గడువు ముగియడంతో.. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది.
Also Read : మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు..
మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC) పరీక్షకు కూడా తేదీలు ఖరారయ్యాయి. జులై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ విడుదల చేయగా.. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 2వ తేదీ వరకూ కొనసాగనుంది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 లాంగ్వేజ్, 182 పీఈటీలు, 6508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు చొప్పున భర్తీ చేయనున్నారు. ఇక బీఈడీ, డీఈడీ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీఎస్సీకి అర్హత సాధించేలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.