తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది. జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉపఎన్నిక నిర్వహణపై ఈసీ దృష్టి సారించింది. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు షెడ్యూల్ రూపొందించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈసీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. పట్టభద్రుల కేటగిరీలో కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని కటాఫ్ డేట్ గా నిర్ణయించింది. అలాగే వచ్చే ఏడాది జూన్ 8వ తేదీకల్లా జనగాం లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉన్నట్లు శుక్రవారం విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొంది. ఓటర్లుగా పట్టభద్రులు పేర్లు నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 30న సీఈఓ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు(ఫామ్ 18)ను సమర్పించవచ్చు.
ఫిబ్రవరి 21 వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్, మార్చి 13 వరకూ అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు, మార్చి 29 వరకూ అభ్యంతరాల పరిష్కారానికి గడువు ఉంటుంది. పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ఏప్రిల్ 4న విడుదల చేస్తారు.
.
.