Graduate MLC By Election Polling has Ended in Telangana: తెలంగాణలో వరంగల్ – నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరిగింది. బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్ నమోదైంది.
మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను నల్లగొండ స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు వరంగల్ లో 30 శాతం పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 28.38 శాతం, హనుమకొండ జిల్లాలో 32.90 శాతం, వరంగల్ జిల్లాలో 31.05 శాతం, మహబూబాబాద్ జిల్లాలో-28.49 శాతం, భూపాలపల్లి జిల్లాలో 27.69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ములుగు జిల్లాలో 31.99 శాతం ఓటింగ్ నమోదైంది.
Also Read: ‘నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. నాపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోను’
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, భార్యతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం భువనగిరి జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ తో కలిసి సందర్శించారు.
అటు హనుమకొండలోని పింగిలి జూనియర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటేశారు. ఇటు నకిరేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సతీ సమేతంగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నల్గొండ జిల్లా హాలియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. మరోవైపు.. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి సైతం ఓటేశారు. హనుమకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: Telangana Song Composing : కీరవాణితో తెలంగాణ గీతంపై ట్రోలింగ్.. తనకు సంబంధం లేదన్న సీఎం రేవంత్
మూడు జిల్లాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 600 పోలింగ్ బూత్ ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా.. అత్యధికంగా పురుష ఓటర్లే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో లక్షా 23వేల 985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.