Telangana: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారంలోగా విధుల్లోకి చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.
గత 11 రోజులుగా జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.
ఉద్యోగ నియామక ఒప్పందాన్ని జేపీఎస్లు ఉల్లంఘించారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా యూనియన్లు ఏర్పాటు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగ నియామకాల్లో అందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా చెప్పలేదని సర్కార్ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.
పనితీరు బాగున్న వారిని మాత్రమే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పామంది ప్రభుత్వం. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. ఆ లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ జేపీఎస్లను హెచ్చరించింది.
సర్కార్ అల్టిమేటంతో.. జేపీఎస్ల తదుపరి కార్యాచరణ ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ జారీ చేసిన నోటీసులకు తలొగ్గి.. విధుల్లో చేరుతారా లేక సమ్మెను కంటీన్యూ చేసి పంతం నెగ్గించుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జీపీఎస్లు సమ్మె విరమించకపోతే సర్కార్ అన్నంత పని చేస్తుందా? కార్యదర్శులను నిజంగానే విధుల నుంచి తొలగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. మరో 6నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా? చూడాలి..