Telangana Govt: హైదరాబాద్, స్వేచ్ఛ: సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు వేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను నాన్ లోకల్ పోస్ట్కు బదిలీ చేశారు. అలాగే, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3(సుంకిశాల) అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీశ్లపైనా వేటు పడింది. అలాగే, నిర్మాణ సంస్థ మేఘాకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది.
మేఘాకు ఉచ్చు బిగుస్తుందా?
సుంకిశాల ప్రాజెక్ట్ను మేఘా సంస్థ నిర్మిస్తోంది. నాసిరకం పనుల నేపథ్యంలో ఈమధ్యే రక్షణ గోడ కూలిపోయింది. పంప్హౌస్ నీట మునిగింది. ఇందులో పూర్తిగా నిర్మాణ సంస్థ మేఘా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు విచారణ జరిపారు. గోడ కూలిపోవడంపై ఆరా తీశారు. అసలేం జరిగిందో తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంది. సంబంధిత అధికారులపై వేటు వేసింది. అలాగే, మేఘా సంస్థకు నోటీసులు పంపింది. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి, నిజానిజాలేంటో బయటపెట్టాలని స్పష్టం చేసింది.
Also Read: Amitabh Bachchan: సినిమాలు కూడా చేయనవరం లేదు.. ఒక్క ఎపిసోడ్ కు అన్ని కోట్లా.. ?
అసలేం జరిగింది?
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కు చేరుకున్నా కూడా నగరానికి తాగునీటి తరలింపు కోసం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ.2,200 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అయితే, ఈనెల 2న సాగర్ రెండో లెవెల్లో నిర్మిస్తున్న సొరంగం నుంచి నీళ్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. దీంతో గేటుతోపాటు రక్షణ గోడలోని ఒక ప్యానల్ కూలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.