హైదరాబాద్, స్వేచ్ఛ: రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసింది. అర్హులైన అన్నదాతలకు రూ.2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేసింది. ఆపైన ఉన్న రుణ మొత్తాన్ని జమ చేసిన వెంటనే రూ.2 లక్షల వరకు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే, టెక్నికల్ సమస్యల వల్ల కొందరికి మాఫీ జరగలేదు. త్వరలోనే వారికి కూడా రుణమాఫీ అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే క్రమంలో రైతులకు హామీ ఇచ్చిన క్విటాలుకు రూ.500 బోనస్ అమలుకు సన్నద్ధమైంది.
ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్
ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై ఈమధ్య పౌర సరఫరాల శాఖ, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేసిన సీఎం, ఈ సీజన్ నుంచే ఒక్కో క్విటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్
కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ధాన్యం సేకరణకు సంబంధించి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ధాన్యం కొనుగోలు, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం కోసం ఈ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీలో ఆర్ధిక శాఖ మంత్రి భట్టి, శ్రీధర్ బాబు, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. గోదాముల లీజ్, రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ అంశాలను వీరు పరిశీలన చేస్తారు.
48 గంటల్లోనే డబ్బుల జమ
ప్రస్తుత సీజన్లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు వేశారు. రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.