Telangana Assembly Budget Sessions Live Update: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుబట్టింది. పీసీఎస్ఎస్ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్ తెలిపింది. లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది.
రీ-ఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు, చేర్పులు చేశారని కాగ్ తెలిపింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు లక్షా 47 వేల 427.41 కోట్లకు చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే.. లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాల్లో మాత్రం తదుపరి పెరుగుదల ఏమీ లేదని వివరించింది. ఆ విధంగా రెండు ప్రాజెక్టుల సంయుక్త విలువ ఇప్పుడు లక్షా 51 వేల 168.21 కోట్లుగా ఉంది.
Read More: హైదరాబాద్ లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి హాజరు..
పీసీఎస్ఎస్ ప్రాజెక్టుతో పోలిస్తే.. రీ-ఇంజనీరింగ్ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుచ్ఛక్తి 5, 643.39 మిలియన్ యూనిట్ల మేర పెరిగిందని కాగ్ తెలిపింది. విద్యుత్ వినియోగంపై ఏటా అయ్యే ఖర్చు 3 వేల 555.34 కోట్ల మేర పెరిగిందని వెల్లడించింది. పీసీఎస్ఎస్ ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్, ప్రాజెక్టు పనుల్లో కొన్ని భాగాలు నిరర్ధకమయ్యాయని.. ఫలితంగా 767.78 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లిందని నివేదికలో కాగ్ వెల్లడించింది.