Governor Tamilisai Soundararajan Speech In TS Assembly Budget Session 2024: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. కాళోజీ కవితతో స్పీచ్ ను మొదలుపెట్టారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ వద్ద గత సర్కార్ ఏర్పాటు చేసిన కంచెను తొలగించిందని తెలిపారు. దీంతో ప్రజాభవన్లో ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ప్రగతిభవన్.. ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోందన్నారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. అర్హులైనవారికి రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టంచేశారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పగించిందని తమిళిసై అన్నారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. దశాబ్దకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తామన్నారు. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మౌళిక వసతులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు. TSPSC, SHRC లాంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామని గవర్నర్ తెలిపారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు.
టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని గవర్నర్ తెలిపారు. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించామన్నారు. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్తగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుస్సేన్సాగర్, లక్నవరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తామని తెలిపారు.