Telangana : తెలంగాణలో ఎన్నికలకు మరో 4 నెలల సమయమే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ లోని చాలామంది నేతలు హస్తంగూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలు అధికార బీఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్నాయి. కర్ణాటక ఎఫెక్ట్ తో బీజేపీ బలహీనపడింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో గులాబీ బాస్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించేందుకు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బీసీల్లో చేతివృత్తులవారికి లక్ష సాయం అందించే పథకాన్ని తీసుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించారు.
తాజాగా మరో కొత్త పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు సర్కార్ తోడ్పాటు అందిస్తోందన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భిన్న సంస్కృతులు, విభిన్న మతాల ఆచార సంప్రదాయాలను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలతో మైనారిటీల్లోని పేదరికాన్నినిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందన్నారు.
అట్టహాసంగా ప్రారంభించిన బీసీల్లో చేతివృత్తులవారికి లక్ష సాయం అందించే పథకానికి ఆదిలోనే నిధుల సమస్య ఏర్పడింది. తొలిరోజు డబ్బులు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తాయి. ఈ పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి మైనార్టీలకు లక్ష సాయం అందించే పథకానికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పథకానికైనా నిధులున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.