TSRTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల( Bread winner Scheme) కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
విధి నిర్వహణలో మరణించిన వారి వారసులతో కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ నిర్ణయంతో విధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు ఊరట లభించనుంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పదేళ్ల పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు మంత్రి.
కారుణ్య నియామకాల్లో భాగంగా హైదరాబాద్ రీజియన్లో 66, సికింద్రాబాద్ 126, రంగారెడ్డి 52, నల్గొండ 56, మహబూబ్నగర్ 83, మెదక్ 93, వరంగల్ 99, ఖమ్మం 53, అదిలాబాద్ 71, నిజామాబాద్ 69, కరీంనగర్ రీజియన్లో 45.. మొత్తంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఇక ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 275 బస్సులు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.