తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం ఊరటనిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళనలతో సర్కారు దిగివచ్చింది. దీంతో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మానవీయకోణంతో ఈ సమస్యను పరిష్కారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాత్కాలికంగా నిలిపివేత…
ఈ క్రమంలోనే గతంలో ఆ శాఖ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. బెటాలియన్ పోలీసుల భార్యల ఆందోళన కారణంగా సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తూ నిర్ణయించింది. ఇదే సమయంలో కానిస్టేబుల్ కుటుంబసభ్యులతో చర్చించాలని సర్కారు ఆలోచిస్తోంది.
వన్ స్టేట్ వన్ పోలీస్ పాలసీ కావాలి…
తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ బెటాలియన్ భార్యలు ఆందోళనకు పూనుకున్నారు. దీంతో ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇక చివరగా సచివాలయం ముట్టడికి సైతం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అరెస్టుల పర్వానికి తెరలేచింది.
ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని ఆయా కుటుంబీకులు కోరుతున్నారు. తమ భర్తలకు, కుమారులకు ఒకే దగ్గర డ్యూటీ వేయాలని డిమాండ్ చేశారు. మెస్ తీసేసి ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలన్నారు.
నోటిఫికేషన్, పరీక్షలు ఒక్కటే అయినప్పుడు ఉద్యోగ నియమ నిబంధనలు అంతా ఒకే రకంగా ఉండాలన్నారు. కానీ తమ భర్తలనే కుటుంబాలకు దూరంగా ఉండేలా విధులకు ఆదేశించడం ఏంటని నిలదీస్తున్నారు.
పోలీస్ భార్యలు బాధ ఇదే…
తమ భర్తలను డ్యూటీ పేరిట ఎప్పుడు పడితే అప్పుడే పిలుస్తారని, సమయం సందర్భం లేకుండానే ఇంటి నుంచి మళ్లీ విధులకు వెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లకు కేవలం డ్యూటీ మాత్రమే ముఖ్యమా, ఈ పోలీసులకు భార్య పిల్లలు లేరా అంటూ పోలీసింగ్ విధానాలపై మండిపడుతున్నారు. మరోవైపు పోలీస్ విధులు నిర్వర్తించాల్సిన వాళ్లతో బటాలియన్ లో గడ్డి తీయించడం, మట్టి సాఫ్ చేయించడం, ఇటుకలు మోయించడం లాంటివన్నీ చేయిస్తున్నారని, అసలు వీళ్లు పోలీసులేనా లేక కూలీలా అంటూ ధ్వజమెత్తారు.
also read : రేపే తెలంగాణ మంత్రివర్గ సమావేశం, ఈసారి వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్