Telangana News Updates : జాతీయస్థాయిలో తెలంగాణ మురిసింది. ఉత్తమ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేంద్రం అవార్డులు అందించింది. జల సమృద్ధి, ఆరోగ్యం, సామాజిక రక్షణ, మహిళా మిత్ర, జీవనోపాధుల పెంపు, సుపరిపాలన, పచ్చదనం-పరిశుభ్రత, స్వయం సమృద్ధ మౌలిక వసతుల కల్పన విభాగాల్లో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం.. 13 జాతీయ పురస్కారాలు దక్కించుకుంది. గ్రామ పంచాయతీలు 11, మండల, జిల్లా పరిషత్తులు ఒక్కొక్కటి చొప్పున అవార్డును కైవసం చేసుకున్నాయి.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఢిల్లీ విజ్ఞాన్భవన్లో పంచాయతీలకు ప్రోత్సాహంపై జాతీయ సదస్సు- అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోపాటు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు అవార్డులు అందుకున్నారు.
తెలంగాణలో పల్లె ప్రగతి పేరిట చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వివరించారు. పనితీరును గుర్తించి తెలంగాణ పంచాయతీలకు అవార్డులిస్తున్న కేంద్రం నిధులను మాత్రం తగ్గిస్తోందని ఆరోపించారు.
గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాజాగా సాధించిన జాతీయ పురస్కారాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో 13 రాష్ట్రమే కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు.
దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. అందులో 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులో 13 తెలంగాణకే వచ్చాయి.