Telangana Free Bus Effect: ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన హామీలను ఎన్నికల సమయంలో ఇస్తుంటాయి. ఆ తరువాత వాటిని అమలు చేస్తుంటాయి. ఇట్లా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా వాటి హామీలు.. అధికారంలో వచ్చాక ఏం చేశారు.. అనే అంశాలపైనే ఎక్కువగా చర్చిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ పార్టీలకు అదే ప్రొగ్రెస్ కార్డు అవుతుంది. వాటిని బట్టే ఆ పార్టీలకు మనుగడ భవిష్యత్తులో ఉంటుందా లేదా.. అనేది అక్కడే అర్థమవుతుందని చెబుతుంటారు రాజకీయ నిపుణులు. అయితే, ఒక్కో పార్టీ ఒక్కో విధంగా హామీలు ఇస్తూ ఉంటుంది. కొన్ని సాధ్యమవుతాయా? అనే విధంగా కూడా ఆలోచన వస్తుంది వాటి గురించి విన్నప్పుడు. కానీ, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే, ఈ క్రమంలో ఆ పార్టీలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటాయి. అలా వేస్తేనే హామీలు నెరవేర్చడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ హామీల అమలుకు ఎంతో కృషి అవసరం. దీనితోపాటు ఎంతో డబ్బులు కూడా అవసరముంటుంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఏ చిన్నపాటి పొరపాటు చేసినా అనుకున్నది తడబడుతుంది. చేయాలనుకున్నది విఫలమవుతుంది. అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఆ వ్యతిరేకత ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది.
Also Read: రాష్ట్ర పర్యాటకంపై అమెరికాలో అంతర్జాతీయ స్థాయి ప్రచారం.. ప్రశంసల పరంపర
ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే.. ఏ పార్టీ అయినా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. కానీ, పలు పార్టీలు ఎంతో ఆశ్చర్యకరమైన హామీలు అమలు చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో చిన్న ఒడిదొడుగులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఓ పథకం అమలు కావాలంటే.. ఒక్క వ్యక్తో.. పదిమందో కాదు.. ఏకంగా వ్యవస్థ మొత్తం పని చేయాల్సి ఉంటుంది. ఇటువంటి క్రమంలో చిన్న ఒడిదొడుకులు తప్పవు. వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి. మరో విషయం ఏమంటే.. ఏ ప్రభుత్వమైనా పథకాలను అమలు చేస్తుంది. కానీ.. వాటిని సరైన రీతిలో ఆ ఫలాలను పొందే విధంగా ప్రజలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లేని యెడల ఆ పథకాల అమలులో కొద్ది ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అదేవిధంగా అలా ఏ ఒక్కరికో ఇద్దరికో సమస్య ఎదురైనప్పుడు… దానర్థం అందరికీ ఎదురవుతున్నట్లు కాదు. ఆ పథకం అమలు ఫలించడంలేదు అని కాదు. ఒక్కోసారి ఇటువంటి ఇబ్బందులు ఎదురైనా పలు ప్రభుత్వాలు ఏ మాత్రం జెడవకుండా ముందుకు వెళ్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లవు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఆ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ పేర్కొంటుంటాయి.
అటువంటి సాహసం చేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది. అందులో ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకం. ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అనగా డిసెంబర్ 9 నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. చాలా సక్సెస్ ఫుల్ గా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీమెంట్ చేస్తుంది. అయితే, ఏదైనా కూడా ఫ్రీ అంటే జనాలు ఎగబడుతుంటారు. అది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంత మాత్రానా ఇచ్చేవాళ్లు తప్పుకాదు.. పుచ్చుకునే వాళ్లు తప్పు కాదు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న సమయంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఈ విషయంలో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఆర్టీసీ ఇప్పటికీ నష్టాల్లో ఉన్నదని తెలుసు.. అయినా కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ప్రతి నెలా ఆర్టీసీకి ప్రభుత్వం రూ. వందల కోట్ల రూపాయలను అందజేస్తుంది. ఈ పథకాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చామని, తాము అధికారంలో ఉన్నంతవరకు కొనసాగిస్తామని చెబుతూ వస్తున్నది.
అయితే.. బస్సులల్లో మహిళలలు గొడవపడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనినే ఆసరాగా చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇష్టానుసారంగా ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టింది.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇందుకు కారణమంటూ వారు పేర్కొంటున్నారు. ఇది కొంతవరకు పక్కన పెడితే.. రాష్ట్రంలో ఉన్న సుమారు 4 కోట్లకు పైగా ఉన్న ప్రజల్లో సగం వరకు మహిళలే ఉంటారు. వారందరికీ కూడా ఈ పథకం వర్తించనున్నది. దాదాపుగా ఎక్కువ మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటారు. ఎందుకంటే.. వాళ్లు జీవనోపాధికై లేదా ఉద్యోగరీత్యా, లేదా కూలీ పనుల నిమిత్తం.. లేదా బ్రతుకు దెరువు నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో వారికి ప్రయాణ ఖర్చులు తప్పవు. కానీ, పథకం ద్వారా వారికి ప్రయాణ ఖర్చులు మిగులుతున్నాయి కదా. దీంతో కొంతవరకు వారికి లబ్ధి చేకూరుతున్నట్టే. పేదవాళ్లకు ఎంత మిగిలినా వాళ్లకు అది చాలా ముఖ్యం. ఈ రకంగా వారికి ప్రభుత్వం మేలు చేస్తున్నట్టే కదా. మరో విషయమేమంటే.. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది మహిళలను ఖచ్చితంగా గౌరవించి ప్రోత్సహించినట్లే అవుతుంది. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఇవే కాదు.. ఈ పథకంతో ఇంకా ఎన్నో విధాలుగా మహిళలకు మేలు జరుగనున్నది. ఇంతవరకు ఇటువంటి పథకాన్ని ఏ ప్రభుత్వమూ తీసుకురాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని మొదటిసారిగా తీసుకువచ్చింది.
Also Read: రైతు రుణ మాఫీపై సీఎం రేవంత్ దిమ్మ తిరిగే క్లారిటీ
ఏ పథకమైనా సక్సెస్ సాధించాలంటే.. అది పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంటుంది. అప్పుడే అది సక్సెస్ అయినట్టు. ఈ పథకం విషయానికి వస్తే నిర్మోహమాటంగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అమలు చేస్తున్నప్పటి నుంచి నేటి వరకు విజయవంతంగా సక్సెస్ అవుతుంది. ఈ పథకంతో మహిళలకు మేలు జరుగుతుంది. కానీ, పలువురు మహిళలు అక్కడక్కడ బస్సులల్లో గొడవపడుతున్నంత మాత్రానా ఈ పథకం పూర్తిస్థాయిలో అమలవుతలేదని అనడం సరికాదేమో. కాకపోతే అటువంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపై సూచిస్తే బాగుంటుందేమో. ఇటు ప్రభుత్వం కూడా ఇటువంటి సంఘటనలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి.. మరోసారి ఈ విధంగా జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇటు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు కూడా ముందు చూపుతో ఆలోచించి ఎటువంటి గొడవలకు పోకుండా సంయమనంతో ఈ పథకం యొక్క సేవలను వినియోగించుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ఇటు ప్రజలు కూడా ప్రభుత్వం ఉన్నంతవరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.