Telangana Formation Day Celebrations Details: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు హాజరుకావాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతోపాటు పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం అందజేసింది. ఇటు సోనియాగాంధీ కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందింది. ఆవిర్భావ వేడుకల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం సమయంలో…
– జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు.
– ఆ తరువాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.
– అదేవిధంగా రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ ను ఆవిష్కరిస్తారు.
– అనంతరం ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్న సోనియాగాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
– ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు.
సాయంత్రం సమయంలో..
– ట్యాంక్ బండ్ పై సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి.
– హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.
– ఈ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.
– అదేవిధంగా తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే విధంగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్ లో 700 మంది కళాకారులు పాల్గొంటారు.
– అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
– జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు.
– ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపిస్తారు.
– అనంతరం కవి, గీత రచయిత అందెశ్రీని సన్మానించనున్నారు.
– ఆ తరువాత 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమం నిర్వహించనున్నారు.
– దీంతో వేడుకలు ముగియనున్నాయి.