Street Dogs : హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుక్కల బెడద మొదలైంది. గతంలో పలుమార్లు చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు మృతి చెందడంతో హాట్ టాపిక్ గా మారిన విషయం.. మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. రోజు ఈ తరహా ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. కుక్కల దాడి ఘటనలో పలువురు ప్రాణాలను కోల్పోగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
కాగా ఆదివారం ఉదయాన్నే నిజాంపేటలో తండ్రీ కూతుళ్లపై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపింది. నిజాంపేటలోని భండారీ లే అవుట్కు చెందిన నరేష్ కుమార్, అతని కూమార్తెపై వీధి కుక్క దాడి చేసింది. నరేష్కుమార్ అనే వ్యక్తి కాలిని కొరికి కండ పీకేసింది. తండ్రితోపాటు ఐదేళ్ల కూమార్తెకు తలకు కూడా గాయాలయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క లాకెళ్లింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం నిజాంపేట్ రోడ్డు లోని హోలీ స్టిక్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.