Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేనల మద్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయింది. జనసేన తెలంగాణలో ముందు ఒంటరిగా 32 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు బీజేపీ కోసం త్యాగం చేస్తూ కేవలం 9 సీట్లకే పరిమితమైంది.
Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేనల మద్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి అయింది. జనసేన తెలంగాణలో ముందు ఒంటరిగా 32 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు బీజేపీ కోసం త్యాగం చేస్తూ కేవలం 9 సీట్లకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో జనసేన ట్విట్టర్లో ఓ లేఖ రాసింది. ఇంతకుముందు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం జనసేన సహకరించినట్లే.. మళ్లీ ప్రధాన మంత్రి మోడీ కోసం మరోసారి సహకారం అందిస్తోందని ఆ లేఖ సారాంశం.
2014 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గి టిడిపి, బీజేపీలకు మద్దతు ఇచ్చింది. కానీ అప్పటి పరిస్థితులు వేరు. జనసేన ఆ సమయంలో ఇంకా బలపడలేదు.
అదే 2019 ఎన్నికల నాటికి జనసేన ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒక్క సీటు సాధించింది. ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఓటమి నుంచి జనసేన అనేక పాఠాలు నేర్చుకుందని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ కోసం సమయం కేటాయించి, చాలా శ్రమించారు. ఏపీ, తెలంగాణలలో జనసేనను బలోపేతం చేసుకొన్నారు.
ముఖ్యంగా ఏపీలో ఆయన పార్టీకి కొంచెం చెప్పుకోదగ్గ అభ్యర్థులు ఉన్నారు. అందుకే ఈసారి అవకాశం వస్తే ఏపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్దమని పవన్ కళ్యాణ్ పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో 32 స్థానాలలో జనసేన పోటీ చేయబోతున్నట్లు సమాచారం కూడా వచ్చింది.
పదేళ్ళపాటు కష్టపడి రెండు రాష్ట్రాలలో పార్టీని, అభ్యర్ధులను సిద్దం చేసుకున్నాక తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి బీజేపీ కోసమో, లేక టీడీపీ కోసం అని కారణం చెప్పి పోటీ చేయకపోవడం ఒక రకంగా జనసేన రాజకీయ ఆత్మహత్య దిశగా వెళుతున్నట్లే. ఇటీవలే వైఎస్ షర్మిల కూడా స్థాపించిన పార్టీ కోసం ఎంతో శ్రమించి కాంగ్రెస్కు మద్దతు అని ఎన్నికల బరిలో దిగలేదు.
ఇలా పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో వెనుతిరగడంతో జనసేన నేతలు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడు వారిలో పవన్ కళ్యాణ్పై నమ్మకం సన్నగిల్లింది. పవన్ వైఖరి వల్ల ఆయన పార్టీ నేతలలోనే కాక జనసేనను నమ్ముకున్న కొన్ని సామాజికవర్గాలకు కూడా ఆయన అన్యాయం చేసినట్లు అయింది.
ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్, రేపు ఏపీలో టిడిపి కోసం త్యాగం చేయకుండా ఉంటారా? అని జనసేన అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.
మోడీ మళ్ళీ ప్రధాన మంత్రి అయ్యేందుకే బీజేపీకి సహకరిస్తున్నామని జనసేన ఇప్పుడు చెబుతున్నా.. రేపు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ను బీజేపీ ముఖ్యమంత్రి చేస్తుందా? ఎందుకంటే చంద్రబాబు అరెస్టు సమయంలో బీజేపీ పెద్దలు ఆయన మాటలను గౌరవించలేదు.
ఇలాంటి బీజీపీ కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయడం అవసరమా?. ఇలా ఎన్నికలలో పోటీ చేయకుండా వెనుకడుగు వేసుకుంటే పోతే అసలు జనసేనకు భవిష్యత్తు ఉంటుందా? జనసేనను నమ్ముకున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.