Telangana Elections 2023 : ఇంకా రెండంటే రెండే రోజులు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుదిపోరు జరగనుంది. నవంబర్ 30న తెలంగాణలో ప్రధాన పార్టీలకు బిగ్ డే. ప్రచారానికి ఇంకా ఒక్కరోజే సమయం. 28 సాయంత్రం 5 గంటల కల్లా అన్ని పార్టీలు ప్రచారాలను ఆపివేయాలి. ఈ క్రమంలో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలో పాగా వేశారు. రోజుకు నాలుగైదు బహిరంగ సభలు , కార్నర్ మీటింగ్ లు, రోడ్ షో లు నిర్వహిస్తూ.. మాకు ఓటెయ్యండంటే.. మాకే ఓటెయ్యండని ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగాలిస్తున్నారు. ఇదంతా పైకి కనిపించేదే అయితే.. ఓట్లను నోటుతో కొంటారనేది బహిరంగ రహస్యం.
తెలంగాణతో కంటే ముందే మిజోరాం, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3నే తెలంగాణ ఫలితాలతో పాటు రానున్నాయి. కాగా.. ఎన్నికలకు డబ్బు ఖర్చు చేయడంలో తెలంగాణనే నెంబర్ వన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ జరిగే ఎన్నికలే చాలా కాస్ట్లీ అని.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు స్థానిక నేతలు వేలకోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. అంతెందుకు ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నికలోనే పార్టీలు రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కూడా రూ.600 కోట్లు ఖర్చు చేశారంట. ఒక్క నియోజకవర్గానికే అన్ని వందలకోట్లు ఖర్చైతే.. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ఎంత ఖర్చవుతుంది ? రాజకీయ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఎన్నికలకు సుమారు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంత కాస్ట్లీగా మారడానికి కారణం.. ఉప ఎన్నికలేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థే.. తర్వాతి ఎన్నికల్లో గెలుస్తాడన్న నమ్మకం ఆ పార్టీలకు ఉండటమే కోటానుకోట్ల రూపాయలను ఖర్చు చేయిస్తోంది. బహిరంగ సభలకోసం జనసమీకరణకు చేసే ఖర్చు ఒక కారణమైతే.. ఒక్కో ఓటర్ కు వేలల్లో నగదు ఇవ్వడం ఎన్నికల ఖర్చు పెరగడానికి మరో కారణం. ఎన్నికలు వచ్చాయంటే.. ప్రధాన పార్టీలు డబ్బులివ్వకపోయినా.. ఒకరికి ఎక్కువిచ్చి తమకు తక్కువిచ్చినా.. ఓటర్లు ధర్నాలు చేసే స్థాయికి వెళ్లారని అనలిస్టులు చెబుతున్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పట్టుబడిన నగదు, నగల విలువ సుమారు రూ.709 కోట్లు ఉంటుంది. వీటిలో రూ.209 కోట్లు నగదే ఉంటుంది. బంగారం, వెండి నగల విలువ రూ.186 కోట్లు ఉంటే.. మద్యం, ఇతర మత్తు పదార్థాల విలువ 38 కోట్లు ఉంటుంది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం ఉన్న సమాచారం మాత్రమే. ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేస్తున్న వేలకోట్ల రూపాయలతో పోలిస్తే.. ఇదంతా నామమాత్రమేనంటున్నారు విశ్లేషకులు. 28వ తేదీ సాయంత్రం ప్రచారాలు ముగిసినప్పటి నుంచి 30వ తేదీ ఉదయం వరకూ గుట్టుగా ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతుందనడంలో.. సందేహం లేదు.