Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలకు ఇంకా 35 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకా ఏ పార్టీ అభ్యర్థుల లిస్టు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొలివిడత అభ్యర్థుల లిస్టులు విడుదల చేయగా.. బీఆర్ఎస్ సగం అభ్యర్థులకు బీఫామ్ లను అందించింది. మిగిలిన వారిలో.. కొందరి స్థానాలను భర్తీ చేసే యోచనలో ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ రెండో లిస్టు రానుంది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులే సమయం ఉన్న తరుణంలో.. ఇప్పటివరకూ ఏ పార్టీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయకపోవడం గమనార్హం. అభ్యర్థుల ఖరారు, బీఫామ్ ల అందజేత, ప్రచారం.. ఇవన్నీ జరిగేటప్పటికి పోలింగ్ తేదీ రానే వస్తుంది.
రాష్ట్రంలో ముందుగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది బీఆర్ఎస్. హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామానుజపురం నుంచి మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తొలివిడత కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్ర పూర్తయింది. దసరా పండుగ ముగిసిన తర్వాత రెండోవిడత ప్రచారం మొదలవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
కాగా.. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రచారాలను చూసిన ఎవరికైనా కేసీఆర్ ప్రసంగాల్లో పసలేదనిపిస్తుంది. కేసీఆర్ స్పీచ్ లో దమ్ము లేదని, చాలా నిస్తేజంగా సాగుతుందని సొంత పార్టీ శ్రేణుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపై కేసీఆర్.. తన పాలనలో ఏం చేశాడో చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే.. గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రతీచోటా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, తెలంగాణకు నీళ్లు తీసుకురావడం గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లని.. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంతో… ఇకపై చేసింది చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉందనేది… బీఆర్ఎస్ వర్గాల మాట.
కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి BRS మేనిఫెస్టో రూపొందించిందని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అందుకే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో గురించి పెద్దగా మాట్లాడ్డం లేదు. అలాగే ఉద్యోగాల భర్తీ, దళితబంధు సహా చాలా ప్రజా సమస్యల్ని ప్రస్తావించం లేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చామని, కరెంటు కష్టాలు లేకుండా చేశామని మాత్రమే ఆయన చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో.. ఇదీ తాము సాధించిన ఘనత అని చెప్పుకునే అవకాశం కేసీఆర్కు ఇప్పుడు లేకుండా పోయిందని అంటున్నారు. మరి మేడిగడ్డ కుంగుబాటును బీఆర్ఎస్ ఎలా సరిదిద్దుకుంటుంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పుకుంటుందో చూడాలి.