Telangana Elections 2023 : సీఎం కేసీఆర్ పోటీపై కామారెడ్డి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. గజ్వేల్లో నెలకోసారి పర్యటిస్తానని.. అక్కడి అభివృద్ధిపై ఫోకస్ పెడతానన్న సీఎం హామీతో కామారెడ్డి ప్రజలు ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. ఆ రెండు చోట్ల గెలిస్తే దేనిని వదులుకుంటారన్న ప్రశ్న తలెత్తుతున్న వేళ.. గజ్వేల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కామారెడ్డి వాసుల్లో అసంతృప్తిని నింపింది.
ఎన్నికల వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ తొలిసారి రెండు స్థానాల నుంచి బరిలో దిగనున్నారు. ఒకటి తన సొంత నియోజకవర్గం గజ్వేల్ కాగా.. మరొకకటి కామారెడ్డి. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటం.. అక్కడ కేసీఆర్పై వ్యతిరేకత ఉండటంతోనే కామారెడ్డిని కూడా ఎంచుకున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ఆ వ్యూహం కేసీఆర్కు ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇదిలా ఉంటే.. గజ్వేల్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. ఇందులో భాగంగానే గజ్వేల్కు నెలకోసారి వస్తానని హామీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ అక్కడే కంటిన్యూ అవుతారన్న చర్చ మొదలైంది. దీంతో కామారెడ్డి వాసులు ఆలోచనలో పడ్డారు. ఈ స్థానాన్ని వదులుకునే కేసీఆర్కు ఓటేయడం అవసరమా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.