Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రాగానే తనిఖీల పేరుతో పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. జిల్లాల సరిహద్దుల్లో, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. వచ్చే పోయే వాహనాలపై పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఎక్కడ వాహన తనిఖీలు నిర్వహించినా పోలీసులకు గుట్టలకొద్ది నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. కోడ్ అమలై 24 గంటలు గడవకముందే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తొలిరోజు తనిఖీల్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం, వెండి లభ్యమయ్యాయి.
రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఖమ్మం జిల్లా ఆత్మకూరు చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులకు సుమారు 12 లక్షల నగదు పట్టుబడింది. కొణిజర్ల చెక్ పోస్టు వద్ద రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటు హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. వనస్థలిపురం వద్ద రూ.4 లక్షలు సీజ్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.3 కోట్ల 35 లక్షల నగదు తరలింపును గుర్తించారు. బషీర్ బాగ్ లో నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు 300 కేజీల వెండిని సీజ్ చేశారు. ఫిల్మ్ నగర్లో సరైన ధృవపత్రాలు లేని రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు.
ఛాదర్ఘాట్ క్రాస్రోడ్లో రూ.9 లక్షలు, పురానాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టీవాలో తరలిస్తున్న రూ.15 లక్షలు, చందానగర్ ఠాణా పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దురు వ్యక్తుల వద్ద రూ.17 లక్షలు, నిజాం కాలేజీ వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న ఏడున్నర కోట్ల విలువైన బంగారం, వెండిని సీజ్ చేయగా.. ఫిలింనగర్ నారాయణమ్మ కళాశాల వద్ద ఓ కారులో రూ.30 లక్షలు, చైతన్యపురి పీఎస్ పరిధిలో రూ.25 లక్షల నగదు పట్టుబడింది. ఓవరాల్గా రెండు రోజుల్లోనే గుట్టల కొద్ది నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.
సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేకుండా భారీ మొత్తంలో తరలిస్తున్న నగదు పట్టుబడింది. జిల్లా వ్యాప్తంగా రూ.27.33 లక్షలు తనిఖీల్లో లభ్యమవగా.. పోలీసులు ఆ నగదు మొత్తాన్నీ సీజ్ చేశారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో రూ.15 లక్షలు, చివ్వెంల పీఎస్ పరిధిలో రూ 8.25 లక్షలు, కోదాడ రూరల్ రామాపురం చెక్పోస్టు వద్ద రూ.2 లక్షలు, ఆత్మకూర్ పీఎస్ పరిధిలో రూ.1.8లక్షలు పెన్ పహడ్ పీఎస్ పరిధిలో లక్ష రూపాయల్ని సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మూడు రోజుల్లోనే కోట్ల కొద్దీ నగదు పట్టుబడిందంటే.. పోలింగ్ డేట్ వచ్చేసరికి ఇంకెన్ని వందల కోట్లు తనిఖీల్లో పట్టుబడుతాయో చూడాలి.