Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఇంతకాలం చేరికలు, వ్యూహ-ప్రతివ్యూహాలు, గెలుపు గుర్రాల అన్వేషణ..వాటికి కార్యరూపం వంటి వాటిపై కసరత్తులు చేసిన రాజకీయ పక్షాలు ఇక ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా..ఇవాళో రేపో బీజేపీ కూడా జాబితాను ప్రకటించనుంది. దీంతో అసలు సిసలైన పోరు ఇక మొదలుకానుంది. ముక్కోణ పోరులో తలపడబోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీలు ఇక గెలుపే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయబోతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన ఖరారైంది.ఈ నెల 18న కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను ప్రారంభించేందుకు రాష్ట్రానికి రానున్న రాహుల్..మూడ్రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు రాహుల్. ఈ నెల 18,19,20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొనసాగే కాంగ్రెస్ బస్సుయాత్రలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. బస్సు యాత్రలో భాగంగానే.. పాదయాత్రలతో పలువురు కార్మికులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు రాహుల్. అనంతరం నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్.. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు తెలంగాణలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలో తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా.. దసరా తర్వాత రెండో విడత ప్రచారం ప్రారంభించనుంది హస్తం పార్టీ. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరుకానున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ యాత్రకు సోనియా రంగంలోకి దించాలని భావిస్తోంది. సోనియాతో పాటు.. అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది .