తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇప్పటికే ప్రకటించగా .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వచ్చే వారం ప్రకటిస్తుందని తెలుస్తోంది. బీజేపీ కూడా వచ్చేవారంలోనే తన అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని షురూ చేసేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ప్రకటన తర్వాత అసంతృప్తుల సెగ చల్లారడం లేదు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ రాని వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రెడీ కాకపోవడంతో బండి సంజయ్ పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఆసక్తి రేపుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఈటల రాజేందర్ ఎత్తుగడలకు పదును పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ.. గ్యారెంటీ స్కీం కార్డుల ప్రచారంతో వీరు ముందంజలో ఉన్నారనే చెప్పాలి.
వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చడంతో అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబును కాదని చెలిమెడకు టికెట్ ఇవ్వడం అక్కడి బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడలేదు. ఇక హుజూరాబాద్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మంథనిలో కాంగ్రెస్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మిగతా అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. ఒకటి రెండు మినహా మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించడంతో.. మూడోసారి కూడా విజయం తమదేనని బీఆర్ఎస్ చెబుతోంది. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ ఎవరెవరిని బరిలోకి దింపుతుందో వేచిచూడాలి.