Telangana Elections 2023 : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వలసలు జోరందుకున్నాయి. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇందులో అధికార బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది.
ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారడం కామన్. టిక్కెట్ రాలేదని, అధినేత గుర్తించడం లేదని, తమ ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చారని, ఇన్నాళ్లూ పోరాడిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకున్నారని ఇలాంటి రకరకాల కారణాలతో నేతలు పార్టీలు షిఫ్ట్ అవుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార పార్టీలోకి ఎక్కువ మంది చేరుతుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కనిపిస్తోంది. గులాబీ పార్టీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్తున్నారు. ఎక్కువగా హస్తం పార్టీలోకి వస్తున్నారు. ఇది రివర్స్ మైగ్రేషన్ అంటున్నారు.
నిజానికి ఒకదశలో గులాబీ పార్టీలో చాలా మంది నేతలను కేసీఆర్ చేర్చుకున్నారు. అయితే వారిలో చాలా మంది ఇప్పుడు టిక్కెట్ ఆశించారు. కానీ చాలా వరకు సిట్టింగ్ లకే మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు కేసీఆర్. దీంతో ద్వితియశ్రేణి నాయకత్వం అంతా కారు దిగుతోంది. వీరంతా ఆ పార్టీలో ఉక్కపోతకు గురై కారు ఓవర్ లోడ్ కారణంగానే పార్టీలు మారుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. చాలా చోట్ల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్, జెడ్పీ ఛైర్మన్లు.. ఇలా స్థానిక సంస్థల నేతలే చాలా మంది కారు దిగేశారు. నిజానికి ఎమ్మెల్యేకు ఓటు పడాలంటే ఈ స్థాయి నాయకత్వం చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కారు దిగడంతో బీఆర్ఎస్ కు గ్రౌండ్ లెవెల్ లో ఓటు బదలాయింపు జరుగుతుందా అన్నది కీలకంగా మారింది. కారు దిగిన చాలా మంది నేతల్లో ఎమ్మెల్యేలతో పొసగని వారే ఎక్కువగా ఉన్నారు.
ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. కాస్తో కూస్తో పేరున్న నాయకులకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బలంగా లేని నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఆకర్షిస్తూ టిక్కెట్లు ఇస్తోంది కాంగ్రెస్. అయితే పారాచూట్ నేతలకే టిక్కెట్లు ఇస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీలో పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కార్యకర్తలను కాపాడుకుని కష్ట పడ్డ తమ సంగతి ఏంటని నిలదీస్తున్నారు. పైగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు చేస్తూ పార్టీ మారుతున్నారు.
మరోవైపు బీజేపీలోకి వలసలు స్పీడ్ గా కాకపోయినా కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల లిస్టును ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. మరింత మంది నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి రాకుండా పోతారా అని ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారి వస్తారని అనుకుంటున్నారు. అందుకే టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఓ మాటన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థుల ప్రకటనలు సమయం ఉంటుందని, అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడమే తమ వ్యూహమంటూ మాట్లాడారు. అంటే వలస నేతలకు తలుపులు తెరిచి ఉంచారా అన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వస్తుందంటూ రాహుల్ గాంధీ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతున్నారు. అటు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను బస్సు యాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారు. అటు కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్ లో టిక్కెట్ రాని వారిని, అసంతృప్తులను చేర్చుకుంటున్నారు. హస్తం పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. స్పీడ్ కు బ్రేకులు వేయాలని అనుకుంటున్నారు. మరోవైపు కారు సింబల్ ను పోలిన గుర్తులంటూ తొలగించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ జరిపింది. రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే జనం సింబల్స్ కన్ఫ్యూజ్ అయ్యేంత అమాయకులు కాదంటూ బీఆర్ఎస్ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.