Telangana Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ..గెలుపు ఎజెండాతో ముందుకు సాగితోంది. ఇప్పటికే గ్యారంటీ స్కీంల ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. బస్సు యాత్రలతో ఆ జోరు మరింత పెంచనుంది.ఈ మేరకు రేపటి (అక్టోబర్ 18) బస్సు యాత్రకు సన్నద్ధమవుతోంది. ఈ యాత్రలో పార్టీ ముఖ్య నేతలతోపాటు అగ్రనేతలు కూడా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
ప్రజాక్షేత్ర పోరు ప్రచారంలో భాగంగా మూడు రోజులపాటు బస్సుయాత్రలు నిర్వహించనుంది హస్తం పార్టీ. రేపు రామప్ప దేయాలయం(Ramappa Temple)లో శివుడికి ప్రత్యేక పూజల అనంతరం బస్సుయాత్ర ప్రారంభంకానుంది. యాత్రలో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం రామానుజపురంలో మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్(Rahul Gandhi), ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. అనంతరం ములుగు పట్టణం నుంచి భూపాలపల్లి వరకూ 35 కిలో మీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత భూపాలపల్లిలో పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతతో కలిసి వారి సమస్యలపై ఆరా తీయనున్నారు నేతలు. మొదటి రోజు యాత్ర ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
ఈనెల19న రెండవ రోజు యాత్రలో రామగుండం నియోజకవర్గంలో రాహుల్గాంధీ పర్యటించనున్నారు. అక్కడ సింగరేణి, NTPC, RfCL కార్మిక సంఘాల నేతలతోపాటు కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనన్నారు రాహుల్. ఈ భేటీ అనంతరం రామగుండం నుంచి పెద్దపల్లి వరకూ 30 కిలో మీటర్ల మేర బస్సు యాత్ర ఉండనుంది. పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో రైతుల అంశాలపై ప్రసంగిచనున్నారు. తర్వాత పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకూ 35 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు రాహుల్గాంధీ. అదేరోజు సాయంత్రం కరీంనగర్లో గంటపాటు పాదయాత్ర చేపట్టి వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించనున్నారు.
యాత్రలో మూడవ రోజు అక్టోబర్ 20న బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. బోధన్ డివిజన్లో బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మిక కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత నిజాంషుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం బోధన్ నుంచి ఆర్మూర్ వరకూ 50 కిలో మీటర్ల మేర బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆర్మూర్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించడంతోపాటు.. పసుపు, చెరుకు రైతులను కలిసి వారి సమస్యలపై ఆరా తీయనున్నారు. అనంతరం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకూ 25 కిలో మీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నిజామాబాద్లో పాదయాత్రతో మూడు రోజుల బస్సుయాత్ర ముగియనుంది. ల్లీ నేతలు కూడా యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో బస్సుయాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.