Telangana Election : రేపు.. అనగా నవంబర్ 30న తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత కీలకమైన రోజు. రాబోయే ఐదేళ్లు మనల్ని ఎవరు పాలించాలో మనం నిర్ణయించుకునే రోజు. కాబట్టి ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు.
ఇక.. ఓటింగ్ వ్యవహారానికి వస్తే.. ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోండి. మీ ఆధార్, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లండి. ఇప్పటికే మీకు ఓటరు స్లిప్ పంపిణీ చేస్తే సరేసరి. లేకపోతే.. పోలింగ్ బూత్ వద్ద మీ పేరు, వివరాలు చెబితే మీకు అక్కడే స్లిప్ అందిస్తారు.
ఓటు వేసేందుకు బూత్ లోకి వెళ్లాక.. మీ సంతకం తీసుకుంటారు. వేలిపై ఇంకు పెట్టే కార్యక్రమం పూర్తి కాగానే.. మీరు ఈవీఎం మిషన్ వద్దకు వెళతారు.
మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి. ఈవీఎం మిషన్లో మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయగానే.. పక్కనే ఉన్న వివి ప్యాట్ (ఓటర్ వెరిఫెయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రంలో బీప్ అనే సౌండ్ వస్తుంది. ఆ వెంటనే వీవీ ప్యాట్ స్లిప్ వస్తుంది. ఇది 7 సెకండ్లు ఉండి.. తర్వాత కింది డ్రాప్బాక్స్లో పడిపోతుంది. ఆ స్లిప్ మనం తీసుకునే వీలు ఉండదు. కాబట్టి.. అక్కడే చూసుకోవాలి. ఈ స్లిప్లో అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, గుర్తు చూపిస్తుంది.
ఈ దేశానికి మనం ఏం సేవ చేసినా, చేయకపోయినా.. ఎన్నికల రోజు.. క్యూలో నిలబడి ఓటు వేయడం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత. రాబోయే ఐదేళ్లలో మన తెలంగాణను ఎవరు పాలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారో ఆలోచించి మీ నిర్ణయాన్ని ఓటు రూపంలో చెప్పండి.
ఈ ఆలోచన మనందరిలో రావాలి. ముఖ్యంగా యువతలో రావాలి. కనుక.. అందరూ తప్పక ఓటు వేయండి. మీ ఇరుగుపొరుగు ప్రాంతాల్లో అందరినీ చైతన్య పరచండి. ఎవరైనా ఓటు వేసేందుకు రాలేకపోతే.. వారికి మీ సాయం అందించి, పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించండి.
మీరు వెళ్లే సరికే మీ ఓటు ఎవరైనా వేస్తే.. పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేసి మీ గుర్తింపును చూపిస్తే బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దీన్నే ‘టెండర్డ్ ఓటు’ అంటారు. ప్రధాన అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే.. మీ టెండర్ ఓటు గెలుపును నిర్ణయిస్తుంది.
కాసేపట్లో పోలింగ్ సమయం ముగియనుంది లెమ్మని బద్ధకించాల్సిన పని లేదు. నిర్ణీత గడువులోగా పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ల క్యూలో నిలబడితే చాలు. మీరు ఓటేసి రావచ్చు.