Telangana Congress : 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. గెలుపు కోసం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు బాహుబలి టీంను సిద్దం చేస్తోంది అధిష్టానం. కొత్త కమిటీ నేడో, రేపో వస్తుందనే అంచనాలుండగా ఇందులో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 17–18 మంది ఉపాధ్యక్షులు, 70 మంది ప్రధాన కార్యదర్శులు, 120 మంది కార్యదర్శులు ఉండనున్నట్టు సమాచారం.
కొత్త కమిటీలో సీనియర్లు, జూనియర్లు, యువత కలబోతగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత, సామాజిక సమతుల్యత అనే ద్విముఖ వ్యూహంతో కమిటీని కూర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ ప్రతిపాదన ప్రకారం…కొత్త కమిటీలో ప్రస్తుతమున్న ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లనూ కొనసాగిస్తారని, వారికి తోడుగా వైస్ ప్రెసిడెంట్లకు పదోన్నతులిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న 10 మంది సీనియర్ ఉపాధ్యక్షుల సంఖ్యను 17 లేదా 18కి పెంచుతారని భావిస్తున్నారు.
ఉపాధ్యక్షులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వీరికి తోడు అనూహ్యంగా పెరుగుతున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శులను అసెంబ్లీ క్లస్టర్ల ఇంచార్జులుగా నియమిస్తారని సమాచారం. ఇప్పటిదాకా 35–40 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తుండగా ఆ సంఖ్యను 70కి పెంచి క్లస్టర్ బాధ్యతలిస్తారని తెలుస్తోంది.