Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది. ఈ ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఆలోచన చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయి. లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. నిర్మాణంలో లోపం వల్లే బ్యారేజ్ కుంగిపోయిందని రిటైర్డు ఇంజనీర్లు, నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టుకు పెద్దగా నష్టం జరగలేదని బుకాయిస్తోంది. వాస్తవ నివేదికను బయటపెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలు ఆరోపిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోచేశారని…ఆ స్కాంను గుర్తు చేసేందుకు ఏటీఎం నుండి లక్ష రూపాయల నోటు బయటికి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు ఫొటోలు ముద్రించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి.