Dharani Portal: ధరణిపై మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ధరణి రికార్డులను ఒక సింగపూర్ కి చెందిన టెర్రాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థను తప్పించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలకు ఆ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది. ఎన్ఐఐసీ, టీఎస్టీఎస్.. సీజీజీ లలో ఏదో ఒక దానికి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకు గాను ఇటీవలే ఆయా సంస్థలను అధికారులు సంప్రదించినట్లు తెలుస్తుంది.
ధరణిలో 83 లక్షలకు పైగా వ్యవసాయ ఖాతాలు ఉన్నాయి. వీటితో పాటు నిషేధిత భూముల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన భూములు సమాచారం కూడా ధరణి పోర్టల్లో ఉంది. అయితే వాస్తవానికి 2018లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే.. ఇంటి గ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు.. సాఫ్ట్ వేర్ డిజైన్, డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నవంబరు 2న ధరణి పోర్టల్ గా మార్చింది.
ఇక అప్పటి నుంచి ఈ పోర్టల్ ద్వారానే భూములకు యాజమాన్యం హక్కులు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతల కాంట్రాక్ట్ గత ఏడాది సెప్టెంబరులో ముగిసినా కానీ.. మళ్లీ అదే సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే కోట్ల విలువ చేసే భూముల వివరాలు విదేశానికి చెందిన ప్రైవేట్ సంస్థ చేతిలో ఉండడం మంచిది కాదన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ధరణి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకే అప్పగించాలని భావిస్తోంది.
దాంతో ప్రభుత్వ, ప్రైవేట్ భూరికార్డులు, రైతుల వివరాలు, ఇతర సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదని అంచనా వేస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ధరణి ద్వారా జరిగే భూ క్రయవిక్రయాలు మినహా.. మరే ఇతర కార్యకలాపాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 33 రకాల టెక్నికల్ మాడ్యుల్స్ కింద వచ్చే దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తిగా ఆపేసింది. ఈ నేపథ్యంలోనే ధరణి పేరును భూమాతగా మార్చి.. పోర్టర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనసాగించాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది.