Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ గత 10 ఏళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నది. మరెన్నో పరాజయాలు చవిచూసింది. తెలంగాణ ఇచ్చినా 2014 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో 19 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైంది. మునుగోడు, హుజూర్ నగర్ లో సిట్టింగ్ స్థానాలను ఉపఎన్నికల్లో కోల్పోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోయింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. తొలి అడుగు..
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక వచ్చింది. కార్నర్ మీటింగ్ లకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలంగాణలో భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారు. నాయకులను సమన్వయం చేసుకుంటూ ఈ యాత్రను విజయవంతం చేశారు. అక్కడే కాంగ్రెస్ విజయానికి తొలి అడుగు పడింది.
కర్ణాటక ఎన్నికలు.. టర్నింగ్ పాయింట్..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం .. తెలంగాణలో పార్టీకి బూస్టింగ్ లా పనిచేసింది. ఆ ప్రభావం తెలంగాణపై బాగా పడింది. క్యాడర్ లో జోష్ వచ్చింది. గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణలోనూ గెలిస్తామనే నమ్మకం నాయకులలో కలిగింది. ఇదే అదనుగా జనంలోకి దూసుకుపోయారు.
రైతు డిక్లరేషన్..
ఏడాది క్రితమే వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ వస్తే రైతుల కోసం ఏం చేస్తామా చెప్పారు. ఈ హామీలకు రైతుల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచాయి.
యూత్ డిక్లరేషన్..
సరిగ్గా 6 నెలల క్రితం ప్రియాంక గాంధీ హైదరాబాద్ సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని భరోసా కల్పించారు. ఈ హామీతో యువ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు.
బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్..
బడుగు, బలహీన వర్గాలే కాంగ్రెస్ పార్టీకి బలం. ఆ వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. తిరిగి హస్తం పార్టీపై ఆదరణ చూపించారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలు..
తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మైలేజ్ ను మరింత పెంచాయి. మహిళలకు రూ. 2500 ఆర్థికసాయం, ఫించన్లు రూ. 4000కు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రూ. లక్షతోపాటు తులం బంగారం, విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, రైతులకు రూ. 15వేలు రైతు భరోసా, రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు సాయం ఇలాంటి హామీలన్నీ ప్రజలు ఆకర్షితులయ్యారు. దానికి కాంగ్రెస్ మేనిఫెస్టో మరింత బలాన్ని ఇచ్చింది.
నాయకుల మధ్య ఐక్యత..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకులను కలుపుకోవడంలో తనదైన పంథా అనుసరించారు. అవసరమైతే ఒకమొట్టు దిగుతానని పదే పదే ప్రకటించారు. అందర్నీ కులుపుకునే పోయే ప్రయత్నం చేశారు. అందుకే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కాంట్రవర్సీలు కనిపించలేదు. సీట్లపై రగడ జరగలేదు. అంతా ఐక్యంగా పనిచేశారు. అందుకే కాంగ్రెస్ పై ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది.
చేరికలు..సీట్ల ఎంపిక..
ఎన్నికల ముందు పార్టీలోకి బలమైన నాయకులను తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో ముందుకెళ్లారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే నేతలు రావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కసిరెడ్డి నారాయణరెడ్డి లాంటి బలమైన నేతలు పార్టీలోకి వచ్చేలా చేశారు. వారందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అభ్యర్థుల ఎంపిక మంచి కసరత్తు జరిగింది. సర్వేల ఆధారంగా టిక్కెట్లు ఇచ్చారు. చివరి నిమిషాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చారు. వనపర్తి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి ఇలాంటి మార్పులే దోహద పడ్డాయి.
ప్రచారం.. సోషన్ మీడియా..యాడ్స్..
ఎన్నికల క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారంతో కాంగ్రెస్ జనాలకు బాగా దగ్గరైంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి రూపొందిన యాడ్స్ తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి.
యువ చైతన్యం..
కేసీఆర్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగాలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇది తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం ఏం చేస్తామో స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎండగట్టారు. ధనిక రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందంటూ నిలదీశారు.
ధరణి పోర్టల్..
ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడిన రైతులకు కాంగ్రెస్ అభయం ఇచ్చింది. అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని హామీఇచ్చింది. రైతుల్లో ధైర్యాన్ని నింపింది. ఇలా ఎన్నో అంశాలు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి దోహదపడ్డాయి.