Congress: కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించనవసరం లేదు.. వాళ్లను వాళ్లే ఓడించుకుంటారు. రాజకీయాల్లో పాపులర్ కొటేషన్ ఇది. అట్లుంటది మరి కాంగ్రెస్ తోని. ఎప్పుడూ ఆధిపత్య పోరే. ఎల్లప్పుడూ అంతర్గత కుమ్ములాటలే. హస్తం చేతిరాతను ఎవరూ మార్చలేరని అంటారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా వచ్చాకైనా కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని.. క్రమశిక్షణ పెరుగుతుందని ఆశిస్తే.. అడియాసే అయిందంటున్నారు. రేవంత్ రెడ్డి మీదనే కుప్పలు తెప్పలు కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు.
లేటెస్ట్ గా కాంగ్రెస్ కుటుంబ వ్యవహారం హస్తినకు చేరింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. పార్టీ కమిటీలన్నిటినీ ప్రక్షాలన చేయాలని భావిస్తున్నారు. పీసీసీ, డీసీసీ కమిటీల్లో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు.. జాతీయ అధ్యక్షుడు ఖర్గే ముందు కోరికల చిట్టా ఉంచారట రేవంత్ రెడ్డి.
విషయం తెలిసి సీనియర్లు అలర్ట్ అయ్యారు. వెంటనే వాళ్లు కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ పదవులన్నిటినీ రేవంత్ రెడ్డి తన వర్గీయులతో నింపేస్తారని జాగ్రత్త పడుతున్నారు. ఖర్గే ఇంటి ముందు క్యూ కట్టి.. ఒక్కో నేత ఒక్కో తరహా విన్నపాలు చేస్తున్నారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ.. ఇలా సీనియర్లంతా ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. అంతా ఖర్గేను కలిశారు. తమదైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అందులో ఎలానూ రేవంత్ రెడ్డి గురించి కంప్లైంట్స్ ఉంటాయంటున్నారు.
తన పదవి ఊస్ట్ అవకుండా.. తమ వారి పదవులు పదిలం చేసుకునేలా.. ఖర్గేకు మొరపెట్టుకున్నారట సీనియర్లు. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా మార్చుతారని టాక్. అందుకే కాబోలు జగ్గారెడ్డి ఇటీవల తెగ ఫైర్ మీదున్నారు. కాంగ్రెస్ లో ఇలాంటివి కామనే. ఎవరెన్ని ఫిర్యాదులు, డిమాండ్లు చేసినా.. అంతిమంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాబితానే కన్ఫామ్ అవుతుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయినా తమ కోసం, తమవారి కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్లు.