CM Revanth Reddy : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు.
కాగా.. ఈ నెల11న టీడీపీఎల్పీ సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలంతా కలిసి చంద్రబాబునాయుడిని టీడీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. నిన్న జరిగిన ఎన్డీయే సమావేశంలో టీడీపీ కీలక మంత్రి పదవులతో పాటు.. స్పీకర్ పదవిని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నేడు జేపీ నడ్డా ఇంటిలో టీడీపీ, జేడీయూకి ఇచ్చే మంత్రుల శాఖలపై చర్చ జరిగింది.
Also Read : చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఛేంజ్.. ఎందుకంటే?
ప్రస్తుతం మోదీ మంత్రివర్గ కూర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ డిమాండ్ చేసిన మంత్రి పదవులను బీజేపీ ఇస్తుందా లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ కీలక శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే, మౌలిక వసతుల శాఖలతో పాటు సంక్షేమ శాఖ, స్పీకర్ పదవిని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకుని.. డిప్యూటీ స్పీకర్ పదవి, పౌర విమానయాన, ఉక్కుశాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల్ని, శివసేనకు భారీ పరిశ్రమల శాఖ, జేడీఎస్ కు వ్యవసాయశాఖ కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.