CM Revanth Reddy Met Chukka Ramaiah(Telangana today news): మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. కొంత కాలంగా అనారోగ్యంతో చుక్కా రామయ్య బాధపడుతుండడంతో గురువారం సాయంత్రం విద్యానగర్ లోని ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి రామయ్య పెద్ద కుమార్తెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామయ్యను సీఎం సన్మానించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అనంతరం పరిపాలన విషయమై రామయ్యతో మాట్లాడారు. తమ పాలన ఎలా ఉందో చెప్పాలంటూ రామయ్యను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చుక్కా రామయ్యతో తనకున్నటువంటి అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Also Read: రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. నిడివి ఎంత ఉందంటే..?
అంతకుముందు సచివాలయంలో మంత్రులు, పలువురు ప్రతిపక్ష నేతలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గీతంపై చర్చించారు. నేతలకు కీరవాణి, ఆయన బృందం ఆ గీతాన్ని పాడి వినిపించారు. ఆ పాట విన్న నేతలు బాగుందంటూ పేర్కొన్నారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కవి అందెశ్రీకి ఆ దిశగా పరిశీలించాలంటూ సీఎం చెప్పారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు, కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గీతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటూ ఆయన పేర్కొన్నారు. జూన్ 2న ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని తెలిపిన విషయం విధితమే.