Medigadda barrage news(Breaking news in telangana): తెలంగాణలో గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ మేడిపండని తేలడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా మంగళవారం సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ టూర్కి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ టూర్ ప్రారంభంకానుంది.
ముందుగా ఉదయం 10 గంటలకు అందరూ అసెంబ్లీకి హాజరుకానున్నారు. అనంతరం సభను స్పీకర్ వాయిదా వేస్తారు. 10:15 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరుతారు. భువనగిరి, జనగాం, హనుమకొండ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వరకు టూర్ కొనసాగనుంది. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో పిల్లర్ను పరిశీలించనున్నారు.
Read More: కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి.. హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..
బ్యారేజీ సందర్శన తర్వాత ఇరిగేషన్ అధికారులతో, ఇంజనీర్లతో భేటీ అవనున్నారు. మేడిగడ్డ కుంగుబాటు గురించి ప్రత్యేక ప్రజెంటేషన్ను అధికారులు ఇవ్వనున్నారు. కాగా ఈ టూర్కు కాంగ్రెస్ నాయకులే కాకుండా అన్ని పార్టీ నేతలకు ఇన్విటేషన్ పంపించారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ మాత్రం ఈ టూర్కు హాజరుకావడం లేదని స్పష్టం చేసింది.
అటు బీఆర్ఎస్ నేడు నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. కేఆర్ఎంబీకి ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించిందని నిరసనగా చలో నల్గొండ పేరుతో సభ ఏర్పాటు చేశారు.
కాగా సోమవారం అసెంబ్లీలో వాటర్ వార్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నల్గొండ ప్రజలను మోసం చేసి ఏ మొఖం పెట్టుకొని సభ పెట్టుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.
అటు మేడిగడ్డ టూర్, ఇటు చలో నల్గొండ సభ.. ఈ రెండు కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు మంగళవారం మంచి కిక్ ఇవ్వనున్నాయి.