Sonia Gandhi-Revanth Reddy(Telangana today news): ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. సుమారు అరగంట పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారంటీలపై చర్చించారు. భేటీ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి పార్టీ అగ్రనేతను కలిశామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. రానున్న పార్టమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచే పోటీ చేయమని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ దీనికి సంబంధించి తీర్మానం చేసినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారంటీలను వివరించినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన రెండు నెలల్లోనే 15 కోట్ల జీరో టికెట్లు జారీ అయినట్లు ఆవిడకు వివరించారని స్పష్టం చేశారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపామన్నారు.