CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మరింత దృష్టిపెట్టారు. ఈ నెల 24 న అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. డా బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగే సదస్సులో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం హజరుకానున్నారు.
ఈ మేరకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి కాన్ఫరెన్స్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలుతోపాటు.. భూ రికార్డులతో ముడిపడిన అంశాలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఎజెండాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ప్రతి గ్రామంలో వాడవాడలో 8 రోజులపాటు ప్రజావాణి నిర్వహించే కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, స్థానికంగా అందిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహణపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.