Crop Loan Waiving: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. నిధుల విడుదల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు ప్రయోజనాలే మా ప్రభుత్వ విధానం. రూ. లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం. ఇవాళ రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో పండుగరోజు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు పదేళ్లలో రూ. 14 లక్షల కోట్లు ఎగవేశాయి. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. రైతుల రుణమాఫీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతుల మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. రెండో విడతలో భాగంగా 6.4 లక్షల మంది రైతుల రుణమాఫీకి సంబంధించి రూ. 6,190 కోట్లు జమ చేశామన్నారు. సాధ్యం కాదనుకున్నవారికి రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు. రూ. 1580 కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వమే కడుతుందని చెప్పారు.
Also Read: బీఆర్ఎస్ ఘర్వాపసీ.. కేటీఆర్తో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే భేటీ
ఆ తరువాత మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. రూ. లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఒకే పంట కాలంలో రూ. 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నారు.