Governor Tamilisai Visit To of Medaram Jatara 2024: గురువారం రాత్రి మేడారంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం సమ్మక్క తల్లి గద్దెనెక్కడం. చిలకలగుట్ట నుంచి జన నీరాజనాల మధ్య, డప్పు చప్పుళ్ల నడుమ సమ్మక్క తల్లి గద్దె మీదకు ప్రవేశించింది.
సమ్మక్క తల్లి రాకకు గుర్తుగా ములుగు ఎస్పీ శబరీష్ ఏకే 47తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ మహాఘట్టం గురువారం రాత్రి 9: 28 గంటలకు ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా మేడారంలో మూడు నిమిషాల పాటు కరెంట్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా నేడు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు. గవర్నర్ తమిళిసై నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు ప్రముఖులు వస్తుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో గత జాతరలో అమ్మవార్లను దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. ఈసారి ముఖ్యమంత్రి హోదాలో మేడారానికి విచ్చేసి.. వనదేవతలను దర్శించుకోనున్నారు.
Read More: వనం.. జనం అయ్యే జాతర..
ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న గద్దెనెక్కారు. సమ్మక్క కూడా గద్దెనెక్కడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెండురోజుల్లో 50 లక్షల మంది మేడారానికి రాగా మరో 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రేపు(శనివారం) అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.