Chandrababu & Revanth Reddy Meeting updates: తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
‘కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు. గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై ఈ సమావేశంలో చర్చించాం. రెండు రాష్ట్రాల సీఎంలు కూలంకషంగా చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నాం.
సీఎస్ లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీని ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వేయాలని కూడా తీర్మానించాం. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయం తీసుకున్నాం. డ్రగ్స్, సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read: గోవా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు
ఏపీ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ‘విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు ముందుకు రావడం శుభపరిణామం. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.