తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రేపు ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణస్వీకారోత్సవానికి తొలుత రాజ్భవన్లో అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
మరోవైపు అధిష్ఠానం పిలుపు మేరకు రేవంత్రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, బలరాంనాయక్ ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న రేవంత్కు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే ప్రొటోకాల్ బృందం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అధికారిక వాహనాలతో కాన్వాయ్ను ఏర్పాటు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ రవి గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ ఏడీజీ అనిల్కుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ను వేదిక వద్ద ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలిస్తున్నారు.