Telangana CM : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై గవర్నర్ కార్యాలయం నుంచి సాధారణ పరిపాలన శాఖకు సమాచారం వెళ్లింది.
మరోవైపు సీఎల్పీ నేత ప్రకటనపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానంతో చర్చిస్తారు. అక్కడ నుంచి ప్రకటన వచ్చాక గవర్నర్ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఆ తర్వాతే ప్రమాణస్వీకారంపై స్పష్టత వస్తుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజ్భవన్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇంకోవైపు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.. రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు ఎన్నికలపై నివేదిక అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించారు. తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళి సై రద్దు చేశారు. మంత్రి వర్గ సిఫార్సు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గెజిట్ ను గవర్నర్ కు సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి అందించారు. తెలంగాణలో కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. దిల్ కుష అతిథి గృహానికి వాహనాలను సిబ్బంది తీసుకొచ్చారు.
కొత్త ప్రభుత్వం కోసం సచివాలయం సిద్ధమవుతోంది. ఛాంబర్లను సాధారణ పరిపాలనా శాఖ సిద్ధం చేస్తున్నారు. సచివాలయంలో పాత బోర్డులు తొలగించారు. మంత్రులు, సలహాదారుల పేషీల సిబ్బంది ఛాంబర్లను ఖాళీ చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీ 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలుండాలి. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కాంగ్రెస్ ను ఆహ్వానించారు. అంతకు ముందు గవర్నర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది.